RRRబాటలో అంబటి...!?
వైకాపా సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు పోలీసులును తనను కస్టడీలో హింసించారని, వారిపై కేసు నమోదు చేయాలని హైకోర్టులో పిటీషన్ వేశారు. ఇటీవల కాలంలో ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబునాయడును ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. పత్రికల్లో రాయలేని విధంగా బహిరంగంగా ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దూషించారు. దీనిపై టిడిపి నేతలు ఆయన ఇంటిపై దాడి చేసి, నిరసన తెలిపారు. వందల మంది టిడిపి మహిళా కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యే గల్లా మాధవి తదితరులు ఆయన ఇంటి వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. కొందరు కార్యకర్తలు, నాయకులు ఆయన ఇంటిపై దాడి చేసి ఇంటి తలుపులను, ఇతర వస్తువులను ధ్వంసం చేశారు. అయితే..అంబటి చేసిన వ్యాఖ్యలకు గాను గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. అయితే..తనను అరెస్టు చేసిన తరువాత పోలీసు కస్టడీలో హించించారని ఆయన పదే పదే చెబుతున్నారు. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్కు ఇంటర్వ్యూలు ఇస్తూ..తనపై పోలీసులు దాడి చేశారని, తనను ఎన్కౌంటర్ చేయాలని చూశారంటూ రకరకాలుగా చెప్పుకుంటున్నారు. ఆయన అరెస్టు తరువాత రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా నాయకులు, కార్యకర్తలు ఆయనను పరామర్శించారు. అంతే కాకుండా అంబటి కాపు కులానికి చెందిన వారు కనుక ఇది కాపులపై జరిగిన దాడి అంటూ ప్రచారం చేస్తున్నారు. తనను పోలీసులు కస్టడీలో హింసించారని, తన పాదాలపై కొట్టారని, తన రెండు కాళ్లు విడదీసి ఇబ్బంది పెట్టారని, కాళ్లపై కొట్టారని ఆయన ఆరోపిస్తున్నారు. అయితే..ఆయన ఆరోపణలకు పెద్దగా స్పందన రాలేదు కానీ..ఇప్పుడు దానిపై విచారణ జరగాలని, తనను హింసించిన పోలీసులపై కేసులు నమోదు చేయాలని ఆయన హైకోర్టులో పిటీషన్ వేశారు. హైకోర్టు దీనిపై ఏమి చెబుతుందో తెలియదు కానీ..ఆయన దాఖలు చేసిన పిటీషన్పై ఇప్పుడు రాజకీయంగా చర్చ జరుగుతోంది.
అంబటి హైకోర్టులో పిటీషన్ వేశారనే వార్తలు వచ్చిన తరువాత ఆయన రాజకీయంగాపైచేయి సాధించడానికి దీన్ని ఉపయోగించుకుంటున్నారనే విశ్లేషణలు ఉన్నాయి. ప్రస్తుతం అంబటి వ్యవహారం చూస్తుంటే..గతంలో వైకాపా అధికారంలో ఉన్నప్పుడు అదే పార్టీకి చెందిన నర్సాపురం ఎంపి రఘురామకృష్ణరాజును కస్టడీలో హింసించిన విషయాలు గుర్తుకు వస్తున్నాయి. అప్పట్లో వైకాపాలో ఉన్న రఘురామకృష్ణంరాజు వైకాపా అధినేత జగన్మోహన్రెడ్డిని విమర్శిస్తున్నారని, ఆరోపణలు చేస్తున్నారని పేర్కొంటూ..వైకాపా నేతలు చేసిన ఫిర్యాదుపై ఆయన హైదరాబాద్లో ఉంటే..అక్కడ నుంచి పోలీసులు అరెస్టు చేసి గుంటూరుకు తీసుకువచ్చారు. దీని తరువాత పోలీసు కస్టడీలో ఆయనను హింసించారని, గుండెలపై కూర్చుకుని కొట్టారని, పాదాలపై కొట్టారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై అప్పట్లో కోర్టు ఆయనకు గుంటూరు ప్రభుత్వ హాస్పటల్ నుందు, హైదరాబాద్లోని ఆర్మీ హాస్పటల్ నుందు టెస్టులు నిర్వహించింది. దీనిలో ఆర్మీ హాస్పటల్ల్లో ఆయనపై హింస జరిగిందని ధృవీకరించింది. దీనిపై అప్పటి నుంచి ఆయన పోరాడుతున్నారు. ఆయనను పోలీసులు హింసించడంపై అప్పట్లో దేశ వ్యాప్త చర్చ జరిగింది. ఒక సిట్టింగ్ ఎంపినీ ఈ విధంగా హింస్తారా..? అసలు రాష్ట్రంలో వ్యవస్థలు పనిచేస్తున్నాయా..? అనే చర్చతో పాటు..అప్పటి వైకాపా ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అయితే..అప్పట్లో అధికారంలో ఉన్న జగన్ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అయితే..తరువాత కాలంలో రఘురామకృష్ణంరాజు ఆయనకు చెవిలో జోరిగలా..విసిగించారు. దీని తరువాత వైకాపా ప్రభుత్వ పతనం వేగంగా సాగింది. అయితే..ఇప్పుడు అంబటి వ్యవహారంలో కూడా అదే రీతిలో చేయాలని వైకాపా పెద్దలు భావిస్తున్నట్లు ప్రస్తుతం జరుగుతోన్న వ్యవహారాలు స్పష్టం చేస్తున్నాయి. నిజంగా పోలీసులు అంబటిని హింసిస్తే..వారిపై కేసులు పెట్టడంలో తప్పులేదు. కానీ..రాజకీయం కోసం..చేస్తే..రఘురామకృష్ణంరాజు చేసినట్లూ మనమూ చేద్దామనే భావనతో చేస్తే మాత్రం.. ఇక్కడ వైకాపా అడ్డంగా దొరికిపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అప్పట్లో రఘురామకృష్ణంరాజును పోలీసులు హింసించారనే దానిపై స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. అంబటి విషయంలో అటువంటివేమీ కనిపించడం లేదు. మరి హైకోర్టు ఈ విషయంలో ఏమి చేస్తుందో చూడాలి. ఒక వేళ అంబటి విజ్ఙప్తిని పరిగణలోకి తీసుకుని పోలీసులపై కేసు నమోదు చేయిస్తే..అది పెద్ద సంచలనమే. నిన్నటికి నిన్న తమిళనాడులోని తొమ్మిది మంది పోలీసులకు అక్కడి స్థానిక కోర్టు మరణశిక్ష విధించడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అంత రేంజ్లో కాకపోయినా..అంబటి విషయంలో కోర్టు కేసు కనుక నమోదు చేయమని ఆదేశిస్తే..రాష్ట్ర రాజకీయాల్లో అదో పెద్ద సంచలనమే...? చూద్దాం ఏమి జరుగుతుందో..?